MS Dhoni: దయచేసి ఆడు ధోని.. లేకపోతే నేనే ప్రేక్షకుల మధ్యలోకి తీసుకెళ్తా: హర్భజన్
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. అయినా ఇప్పటివరకు ధోని ఆటను చూసే భాగ్యం అభిమానులకు దక్కలేదు. ఇవాళ చెపాక్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై తలపడనుంది. ఈ ఐపీఎల్లో హోం గ్రౌండ్లో చెన్నైకి ఇది చివరి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్లో ధోని బరిలోకి దిగి రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. సీఎస్కే తమ మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశముంది. దీంతో జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘తలా’ ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చని సునీల్ గావస్కర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం హైదరాబాద్తో మ్యాచ్లో ధోని ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ ధోని అలా చేయకపోతే తానే స్వయంగా అతనిని ప్రేక్షకుల మధ్యలోకి తీసుకెళ్తానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
‘‘చూడండి.. చెన్నైలో అభిమానుల ముందు తన చివరి మ్యాచ్ ఆడతానని అతడు చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకునే సమయం ఇప్పుడు వచ్చేసింది. సొంత మైదానంలో సీఎస్కేకు ఇదే చివరి మ్యాచ్. ‘తలా’ బహుశా చివరిసారిగా బరిలోకి దిగడాన్ని మనం చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడకపోతే అతను వచ్చే ఏడాది మళ్లీ తిరిగి వస్తాడని అర్థం చేసుకోవాలి. అతని విషయంలో ఏం జరుగుతుందో చెప్పలేం’’ అని హర్భజన్ పేర్కొన్నాడు. ‘‘దయచేసి ఆడు ధోని.. లేకపోతే నేను నిన్ను ప్రేక్షకుల మధ్యలోకి తీసుకెళ్తా’’ అని భజ్జీ ఫన్నీగా అన్నాడు. హర్భజన్ కొన్నాళ్లు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.